ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు బీఆర్ఎస్ రైతు సమావేశాలు
ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు బీఆర్ఎస్ రైతు సమావేశాలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ vs బిఆర్ఎస్ వార్ నడుస్తుంది. మూడు ఎకరాల పంటకు మూడు గంటల కరెంట్ చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ శ్రేణులు వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ చీకట్లోకి వెళ్తుందని బిఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈ క్రమంలో శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ రైతు వేదిక వద్ద ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు బీఆర్ఎస్ రైతు సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
3 పంటలు బీఆర్ఎస్ నినాదం.. 3 గంటల కరెంటు కాంగ్రెస్ విధానం పేరిట సభలు నిర్వహించాలని తెలిపారు. రైతులకు కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పేలా తీర్మానాలు చేయాలన్నారు. ప్రజల్లోకి కాంగ్రెస్ నినాదాన్ని తీసుకెళ్లాలని , కాంగ్రెస్కు మద్దతిస్తే ఉచిత విద్యుత్ రద్దే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎకరానికి గంట విద్యుత్ చాలనటం రైతులను అవమానించడమే అని అన్నారు. 24 గంటల విద్యుత్ వద్దన్న కాంగ్రెస్ కుట్రను రైతులకు వివరించాలని సూచించారు.