ధరణి పోర్టల్ ఒక మహమ్మారిలా తయారయిందిః భట్టి విక్రమార్క

రాష్ట్రంలోని వనరులను బిఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారన్న భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

హైదరాబాద్‌ః తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. గత తొమ్మిదేళ్లుగా బిఆర్ఎస్ పాలనలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టుగా కెసిఆర్ భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని వనరులను బిఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు.

కెసిఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రాష్ట్ర ప్రజల పాలిట ఒక మహమ్మారిలా తయారయిందని అన్నారు. ధరణి పేరుతో తమ భూములను తమకు కాకుండా చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ కు పట్టం కట్టాలని నిరుద్యోగ యువత కోరుకుంటోందని చెప్పారు. బెల్టు షాపులను మూయించాలని ప్రజలు కాంగ్రెస్ ను కోరుతున్నారని అన్నారు.