పవన్ కళ్యాణ్‌తో కలిసి బిజెపి పని చేస్తుంది: సోము వీర్రాజు

మా నాయకుడు పవన్ ను చంద్రబాబు కలవడాన్ని స్వాగతిస్తున్నాం..సోము వీర్రాజు

Somu veerraju

అమరావతి: ఏపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇంతకాలం బిజెపితో కలిసి ప్రయాణించిన జనసేన… ఇకపై ఆ పార్టీతో పొత్తు ఉండదని పరోక్షంగా తెలిపింది. బిజెపికి ఊడిగం చేయలేమని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కలిసి పని చేయడానికి రూట్ మ్యాప్ ఇవ్వాలని కోరినా బిజెపి నేతలు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. మరోవైపు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజు వల్లే బిజెపికి పవన్ దూరమయ్యారని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో సోము వీర్రాజు మాట్లాడుతూ… తమ నాయకుడు పవన్ కల్యాణ్ ను చంద్రబాబు కలిసి సంఘీభావం తెలిపారని చెప్పారు. తమ నాయకుడిని చంద్రబాబు కలవడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని చెప్పారు. చంద్రబాబు హయాంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాళ్ల దాడి జరిగిందని తెలిపారు. తన హయాంలో జరిగిన విషయాలను చంద్రబాబు గర్తుంచుకుంటే మంచిదని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే పేరుతో చేసే ఉమ్మడి ఉద్యమం అంశంపై మీడియా అనవసరంగా బిజెపిని ప్రశ్నించాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజకీయాల్లో అన్నీ ఉంటాయని.. కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లను కూడా ఇదే కోణంలో చూస్తామని అన్నారు. పవన్ తో కలిసి పని చేస్తామని తెలిపారు. జనసేనతో కలిసి రూట్ మ్యాప్ ను తయారు చేసుకుంటామని వీర్రాజు చెప్పారు.