గవర్నర్ ను కలిసిన బిజెపి నేతలు

BJP Leaders Meet Governor Tamilisai

రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ హత్యలు, పోలీసుల ప్రవర్తన తీరు ఫై తెలంగాణ గవర్నర్ తమిళసై కి బిజెపి నేతలు పిర్యాదు చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తోందని… అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీజేపీ కార్యకర్తలను అణచివేస్తోందని ఈ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రామాయంపేట, ఖమ్మం ఆత్మహత్యల ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

రాజకీయ ప్రత్యర్థులను కౌన్సెలింగ్ పేరుతో అరెస్టు చేసి ఆత్మహత్య చేసుకునేలా వేధింపులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ప్రతిపక్ష నాయకులను కౌన్సెలింగ్‌ పేరుతో హింసిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు విచారణ జరిపితే నిష్పక్షపాతంగా జరగదని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. ఖమ్మం సాయిగణేశ్, కామారెడ్డిలో సంతోశ్, పద్మల ఆత్మహత్య కేసులపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ పోలీసులు తెరాస కార్యకర్తల్లా పని చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా కేసీఆర్ మార్క్ పాలన జరుగుతోంది. పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఖమ్మం, రామాయంపేట ఘటనలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి. కేసీఆర్.. రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.