ఒక్కో ఎమ్మెల్యేను రూ. 20 కోట్లకు కొనుగోలు చేస్తున్నారుః కేజ్రీవాల్

దేశ వ్యాప్తంగా బిజెపిఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోందన్న సిఎం కేజ్రీవాల్

Delhi CM Arvind Kejriwal
Delhi CM Arvind Kejriwal

న్యూఢిల్లీః ఢిల్లీ సిఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బిజెపి పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇప్పటి వరకు ఇతర పార్టీలకు చెందిన 277 మంది ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్ల చొప్పున బిజెపి చెల్లించిందని తెలిపారు. ఈ ఎమ్మెల్యేలను కొనడానికి బిజెపి రూ. 5,500 కోట్లను ఖర్చు చేసిందని చెప్పారు. ఇతర పార్టీ టికెట్లపై గెలిచిన ఈ ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడుపోయి బిజెపిలో చేరిపోయారని విమర్శించారు.

ఎమ్మెల్యేలను పశువులకు కొన్నట్టుగా బిజెపి కొనడంతోనే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని కేజ్రీ అన్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు బిజెపి ఉపయోగించిన సొమ్మంతా సామాన్యుల నుంచి వసూలు చేసిందేనని… అందుకే ద్రవ్యోల్బణం పెరిగిందని చెప్పారు. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో దేశంలో సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ దేశ వ్యాప్తంగా కొనసాగుతోందని కేజ్రీవాల్ అన్నారు. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేశారని… ఇప్పుడు జార్ఖండ్ పై దృష్టిని సారించారని విమర్శించారు. ఢిల్లీపై కూడా వారు కన్నేశారని దుయ్యబట్టారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద కుట్రకు తెరతీశారని విమర్శించారు.

మరోవైపు, తాజాగా తన నివాసంలో కేజ్రీవాల్ నిర్వహించిన సమావేశానికి ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం సందేహాలకు తావిస్తోంది. ఇంకోవైపు, 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను బిజెపి టార్గెట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, బిజెపి తమను సంప్రదించిందంటూ 12 మంది ఆప్ ఎమ్మెల్యేలు చెప్పడం కలకలం రేపుతోంది. తమ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బిజెపి రూ. 800 కోట్లను కేటాయించిందని కేజ్రీవాల్ మండిపడ్డారు.

తాజా ఏపి వార్తల కోసం కిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/