రేపు బిజెపి అభ్యర్థుల ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి రేపు తమ అభ్యర్థుల తాలూకా లిస్ట్ ను ప్రకటించబోతుంది. ఈరోజు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశం కానుంది. ఈ సమావేశంలో మొదటి జాబితాను ఖరారు చేయనుంది. ఇందుకోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌లు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో ఉన్న పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జావడేకర్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌లు కూడా బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం వద్ద దాదాపు 40-50 మంది అభ్యర్థుల పేర్లతో మొదటి జాబితా సిద్ధంగా ఉందని బీజేపీ ముఖ్యనేతలు వెల్లడించారు. ఈ జాబితాకు సీఈసీ ఆమోదం తెలపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.