రాష్ట్ర ఆడపడుచులకు కేసీఆర్ కానుక: ఈరోజు నుండి బతుకమ్మ చీరల పంపిణి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటినుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ళు పైబడి రేషన్ కార్డులో పేరు నమోదైన వారికి చీరలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే చీరలు జిల్లాలకు చేరాయి. అక్కడి నుంచి గ్రామాల వారిగా అధికారులు సరఫరా చేశారు. ఈ నెల 6వ తేదీ వరకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
అక్టోబర్ 6వ తేదీ నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అంతకుముందే చీరలు పంపిణీ చేసేలా అధికారులు గ్రామాల వారీగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 810 రకాల చీరలను, 1.08 కోట్ల మహిళలకు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం రూ.333.14 కోట్లు ఖర్చు చేసింది. అయితే.. ఈ సారి సరికొత్తగా 19 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 290 వర్ణాలలో సరికొత్తగా చీరలను రూపొందించారు. కేవలం చీరలే కాదు చీరల ప్యాకింగునూ ఆకర్షణీయంగా చేశారు.