బఠిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల ఘటన.. సైనికుడి అరెస్ట్‌

నలుగురు జవాన్లను చంపింది ఓ సైనికుడే అని గుర్తించిన పంజాబ్​పోలీసులు

Bathinda Police arrests one Army jawan in military station firing that killed 4

చండీగఢ్‌ః ఇటీవల పంజాబ్‌ లోని బఠిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల జరిగిన విషయం తెలిసిందే. గత బుధవారం తెల్లవారుజామున 4:35 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పంజాబ్​పోలీసులు నలుగురు జవాన్లను చంపింది ఓ సైనికుడే అని గుర్తించారు. ఈ మేరకు సోమవారం ఉదయం నిందితుడిని అరెస్టు చేశారు. కేసు వివరాలను సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు గుల్నీత్‌ సింగ్‌ ఖురానా వెల్లడించారు.

ఈ కేసులో మొదట తమన తప్పుదోవ పట్టించిన మోహన్‌ దేశాయ్‌ అనే సైనికుడే నిందితుడని వెల్లడించారు. అతడే కాల్పులకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే నిందితుడు ఈ కాల్పులకు పాల్పడినట్లు చెప్పారు. మృతి చెందిన జవాన్లతో దేశాయ్‌కి వ్యక్తిగత వైరం ఉందని గుల్నీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ ఘటనలో సాక్షిగా ఉన్న మేజర్‌ అషుతోశ్‌ శుక్లా వాంగ్మూలం ఆధారంగా పంజాబ్‌ పోలీసులు ఇద్దరు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆదివారం నలుగురు అనుమానిత జవాన్లను అదుపులోకి తీసుకుని విచారించగా అందులో.. మోహన్‌ దేశాయ్‌ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.