అరెస్ట్ చేసేప్పుడు ట్యాబ్లెట్ కూడా వేసుకోనివ్వలేదుః బండి సంజయ్ భార్య
తన తల్లి చిన్న కర్మలో పాల్గొనకుండా చేశారని ఆవేదన
బొమ్మల రామారం: గత అర్ధరాత్రి దాటిన తర్వాత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే బండి సంజయ్ అరెస్టుపై ఆయన సతీమణి అపర్ణ స్పందించారు. అరెస్ట్ చేసే సమయంలో సంజయ్ కు పోలీసులు టాబ్లెట్స్ వేసుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మంచి నీళ్లు తాగేందుకు కూడా అనుమతివ్వలేదన్నారు. తన భర్తతో పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారన్నారు. కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. అరెస్ట్ సమయంలో ఆయన ముఖానికి గాయం కూడా అయిందన్నారు. తన తల్లి చిన్న కర్మలో సంజయ్ పాల్గొనకుండా చేశారన్నారు. అల్లుడు, కూతురు చేయాల్సిన కార్యక్రమాన్ని సైతం అడ్డుకున్నారని అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలు చెప్పి విజ్ఞప్తి చేసినా పోలీసులు వినలేదన్నారు.
కాగా, అర్ధరాత్రి 12 గంటల తర్వాత సుమారు 100 మంది పోలీసులు సంజయ్ ఇంటిని చుట్టుముట్టారు. ఆయన అరెస్టు చేసే సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని సంజయ్ కోరితే, అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబు ఇచ్చారని బిజెపి వర్గాలు తెలిపాయి. పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ విషయంలోనే బండి సంజయ్ ను అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.