దేశంలో కొత్తగా 4వేలు దాటిన కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా నాలుగు వేలకు పైనే కేసులు వెలుగు చూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 1,31,086 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,435 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్త కేసుల్లో 46 శాతం మేర పెరుగుదల కనిపించింది.

కాగా, 163 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబర్‌ 25న 4,777 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో దేశంలో కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 44,733,719కి చేరింది. ప్రస్తుతం 23,091 కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయి. ఇక గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా కేరళ, మహారాష్ట్రలో నలుగురు చొప్పున, ఢిల్లీ, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హరియాణా, కర్ణాటక, పుదుచ్ఛేరి, రాజస్థాన్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది మృతి చెందారు. దీంతో కొవిడ్‌ మరణాల సంఖ్య 5,30,916కి పెరిగింది.

ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.05 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.76 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 220.66 (220,66,16,373) కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.