రాబోయే ఎన్నికల్లో పాత బస్తీలోనూ పాగా వేస్తాం – బండి సంజయ్

రాబోయే ఎన్నికల్లో పాతబస్తీలోను పాగావేస్తాం అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి 15 సీట్లకన్నా ఎక్కువ రావన్నారు. ఇక పాత బస్తీలోనూ పాగా వేస్తామని తేల్చి చెప్పారు. సొంతంగా సీట్లు ప్రకటించుకునే సంప్రదాయం బిజెపి లో లేదని ..పార్టీలో ఎవరైనా కాషాయజెండా కింద పని చేయాల్సిందేనని తెలిపారు.

అన్ని రకాల మాఫియా వెనుక టిఆర్ఎస్ నేతలున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదని.. వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. మునుగోడులో ఉపఎన్నిక రావాలని టిఆర్ఎస్ కోరుకుంటోందని .. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఉపఎన్నిక రావొద్దని కోరుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై త్వరలో ఢిల్లీకి టీబీజేపీ బృందం వెళ్తుందన్నారు బండి సంజయ్. ఇక క్యాసినో సహా అన్ని దందాల్లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు.