ఆగస్టు 5న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపు

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 5న దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలో ప్రధాని మోడీ నివాసాన్ని ముట్టడించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ప్రధాని నివాసం ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ఈ ఆందోళనల్లో భాగంగా ‘ఛలో రాష్ట్రపతి భవన్’ నినాదంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు. రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజ్ భవన్ ముట్టడి ర్యాలీలు చేపట్టనున్నాయి.

పార్లమెంటు ఉభయ సభల్లో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు ఆ రోజున తొలుత పార్లమెంటుకు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని అక్కడ నిరసన తెలుపుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ప్రధాని నివాసానికి చేరుకుని ముట్టడిస్తారు. అలాగే, ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ల నివాసాలను కాంగ్రెస్ నేతలు చుట్టుముట్టి నిరసన తెలుపుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాగా, జీఎస్టీ, నిత్యావసరాలు, ఇంధన ధరల పెరుగుదను వ్యతిరేకిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు గళమెత్తుతూ అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలుపుతున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ వివిధ పార్టీలకు చెందిన 19 మంది రాజ్యసభ్యులు, నలుగురు కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులును స్పీకర్ సస్పెండ్ చేశారు. అలాగే, పార్లమెంటు బయట నిరసన తెలిపిన ఎంపీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.

ధరల పెరుగుదలపై సోమ, మంగళవారాల్లో రాజ్యసభలో చర్చ జరగనుంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన దాదాపు రెండు వారాల తర్వాత ఈ అంశం చర్చకు రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయ సభల్లోనూ ప్రసంగించే అవకాశం ఉందని సమాచారం.