కేసీఆర్ మాట్లాడుతుంటే..అయన గొంతులో వణుకు, మాటల్లో భయం కనిపిస్తుంది – బండి సంజయ్
శనివారం మునుగోడు సభ లో కేసీఆర్ వ్యాఖ్యల ఫై బిజెపి నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ చేసిన కామెంట్స్ ఫై స్పందించారు. మునుగోడు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని వింటే… ఆయన గొంతులో వణుకు, మాటల్లో భయం, అసహనం కన్పించాయని ఎద్దేవా చేశారు బండి సంజయ్. ఆల్రెడీ టీఆర్ఎస్ పతనం ఖాయమైనట్లుగా ఆయన ప్రసంగంలో స్పష్టంగా కన్పించిందని… చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రధానమంత్రివర్యులు, కేంద్ర హోంమంత్రి వర్యులపై అవాకులు చవాకులు పేలారని వెల్లడించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మాట్లాడే భాషేనా అది ? ఆయన ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ ఛీదరించుకుంటున్నారని ఆగ్రహించారు.
బ్లాక్ మెయిల్ రాజకీయాలతో ఓట్లు పడవనే విషయం కేసీఆర్ గుర్తుంచుకోవాలని బండి సంజయ్ అన్నారు. తెలంగాణకు కృష్ణాలో 575 టీఎంసీలు దక్కాల్సి ఉండగా 299 టీఎంసీల వాటాకే ఒప్పుకున్న దుర్మార్గుడు కేసీఆర్. ఈ విషయాన్ని నేను పలుమార్లు ఆధారాలతో నిరూపించిన. మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని కేసీఆర్ సంతకాలు చేసిండు. ఏపీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పేరుతో కృష్ణా నీళ్లను అక్రమంగా మళ్లించుకుపోతున్నా కేసీఆర్ పట్టించుకోకుండా ఫాం హౌస్లో కుంభకర్ణుడిలా పడుకున్నడు. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతుందని పదేపదే హెచ్చరించినా పట్టించుకోలేదు” అని మండిపడ్డారు.