కిరండోల్ రైలుకు తప్పిన పెను ప్రమాదం

విశాఖపట్టణం నుంచి కిరండోల్ వెళ్తున్న రైలుకు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ రైలుపై భారీవృక్షం కూలడంతో విద్యుత్‌ లైన్‌ (ఓవర్‌హెడ్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌.. ఓహెచ్‌టీ) నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు రైలు నుండి దిగి పరుగులు పెట్టారు.

కిరండోల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి విశాఖ నుంచి బయలుదేరింది. అర్ధరాత్రి అనంతగిరి మండలం తైడా-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా పెద్ద వృక్షం ఒకటి రైలు విద్యుత్ లైన్‌పై కూలిపోవడంతో మంటలు చెలరేగాయి.

ఓ వైపు చిమ్మచీకటి, చుట్టూ అడవి కావడంతో ప్రయాణికులు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందికి దిగారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగించి విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించారు. దీంతో మూడు గంటల తర్వాత రైలు ముందుకు కదిలింది.