భజరంగ్ దళ్ నిషేధానికి కేసీఆర్ కుట్ర అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ ఫై మరోసారి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. గురువారం బీజేపీ ఓబీసీ సమ్మేళనంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో భజరంగ్‌దళ్‌ను నిషేధించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు. భజరంగ్‌దళ్‌ను నిషేధించడంలో కాంగ్రెస్‌తో కేసీఆర్ పోటీ పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుట్రను తిప్పికొట్టటానికి హిందువులంతా ఏకంకావాలని పిలుపునిచ్చారు.

దళిత బంధును ప్రకటించిన కేసీఆర్..బీసీ బంధును ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. బీసీబంధు ప్రకటించటానికి ఇబ్బంది ఏంటో సీఎం కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇవ్వటం‌ వెనుక కుట్ర దాగుందన్నారు. హైదరాబాద్ లో త్వరలో లక్షల మందితో బీసీ శంఖారావ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో రామ రాజ్యం రావడానికి ఇంకా 5 నెలలే టైముందని..అందుకోసం బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించి బీసీల పొట్టకొట్టిందని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ.1600 కోట్లతో సచివాలయం కట్టిన కేసీఆర్… బీసీల ఆత్మగౌరవ భవనం ఎందుకు నిర్మించటం‌లేదని ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఏ మాత్రం ఉండదని స్పష్టం చేశారు. దళితబంధులో 30 శాతం కమిషన్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని ఆరోపించారు. 30 శాతం కమిషన్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయన్నారు.