అసెంబ్లీ లో ప్రభుత్వం ఫై నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ ..జగన్ ప్రభుత్వం ఫై మరోసారి నిరసన వ్యక్తం చేసారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండో రోజు బుధవారం ఉదయం సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను ప్రారంభించగానే తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి తన స్థానంలో ప్లకార్డుతో నిలబడ్డారు. శ్రీధర్ రెడ్డి నిరసనను, ప్రభుత్వం, తాను కూడా గుర్తించామని స్పీకర్ అన్నారు. కానీ, ఇలా చేయడం తగదు, కూర్చుంటూ ప్రభుత్వం స్పందిస్తుందని స్పీకర్ తమ్మినేని చెప్పినా కోటంరెడ్డి అలానే నిల్చుండిపోయారు. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి కావాలనే రగడ చేయాలనుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అని అవసరం అయితే ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు కోరారు.

అలాగే సాగునీటి రంగంపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు , మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల వార్ నడిచింది. సాగునీటిపై అన్ని ప్రభుత్వాలు దృష్టిపెడతాయని.. అయితే ఈ నాలుగేళ్ళు ఈ రంగం పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యిందని అచ్చెన్నా అన్నారు. చంద్రబాబు సీఎంగా సాగునీటికి రూ.68293 కోట్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు. 68 ప్రాజెక్టులు డిజైన్ చేశారని.. 23 ప్రాజెక్టులు పూర్తిచేశారని తెలిపారు. 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు 7 లక్షల ఎకరాలకు స్ధిరీకరణ చేశారన్నారు. ఉత్తరాంధ్రలో ఇఎన్‌సి నారాయణ రెడ్డి 2014-18 మధ్య 69 వేల ఎకరాలు సాగునీరు అందించారని చెప్పారు. ఈ నాలుగేళ్ళలో రూ.488 కోట్లు ఖర్చు చేసి 11 వేల ఎకరాలకు నీరు అందించారన్నారు.