టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద టెన్షన్..టెన్షన్

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ పర్యాటక మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సత్యనారాయణ మూర్తి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అర్ధరాత్రి మూర్తి ఇంటివద్దకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అటు టీడీపీ శ్రేణులు కూడా ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మోహరింపుతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడుతోంది.

పోలీసుల మూమెంట్ చూసిన టీడీపీ శ్రేణులు, బండారు అభిమానులు ఒక్కొక్కరిగా అక్కడకు రావడం మొదలు పెట్టారు. అయితే వారెవర్నీ బండారు ఇంటివైపు రాకుండా పోలీసులు అభ్యంతరం చెప్పారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. తమ లీడర్ ఇంటికి వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను టీడీపీ శ్రేణులు నిలదీయడం మొదలు పెట్టాయి. బండారుకు 41ఏ నోటీసు జారీ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.