చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు వైఎస్‌ఆర్‌సిపి కుట్రలకు తెరలేపిందిః అచ్చెన్నాయుడు

ఆ లేఖ ఫేక్ అని స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు

tdp-atchannaidu

అమరావతిః తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలంటూ కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు కోరినట్టు ఆయన పేరిట వైరల్ అవుతున్న లేఖ అవాస్తవమని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రతిష్ఠ దిగజార్చేందుకు వైఎస్‌ఆర్‌సిపి పన్నిన కుట్రలో ఇది భాగమని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన అధికారంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

వైఎస్‌ఆర్‌సిపి బతుకే ఫేక్ అని, ఫేక్ ప్రచారాలు, లేఖలనే ఆ పార్టీ నమ్ముకుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. చంద్రబాబు రాసినట్టు ఈ లేఖను వైఎస్‌ఆర్‌సిపి ప్రచారంలో పెట్టడాన్ని ఖండించారు. చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఇలాంటి కుట్రలకు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు గానీ, అభిమానులకు గానీ ఎవరికి ఓటేయాలనే విషయంలో టిడిపి అధినేత ఎలాంటి సూచనలు చేయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లేఖను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. లేఖలో చంద్రబాబు ఫోర్జరీ సంతకంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష పార్టీలు నేతలపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.