పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష

Former Pakistan Prime Minister Imran Khan sentenced to 10 years in prison

ఇస్లామాబాద్‌ః పాకిస్థాన్ లో మరో 9 రోజుల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా, ఈరోజు అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార రహస్యాల వెల్లడి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి కూడా శిక్ష పడింది.

దీనిపై ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది నయీం పంజుతా సోషల్ మీడియాలో స్పందించారు. ఈ తీర్పును తాము అంగీకరించబోమని, ఇది అక్రమం అని పేర్కొన్నారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న అభియోగాలపై ఇమ్రాన్ ఖాన్ చాన్నాళ్లుగా విచారణ ఎదుర్కొంటున్నారు.

ఈ కేసు ‘సైఫర్ కేసు’గా ప్రసిద్ధికెక్కింది. గతేడాది అమెరికాలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఓ రహస్య కేబుల్ (సైఫర్)ను పాక్ ప్రభుత్వానికి పంపింది. ఈ కేబుల్ ను ఇమ్రాన్ ఖాన్ బహిర్గతం చేశారన్నది సైఫర్ కేసులో ప్రధాన అభియోగం. అధికార రహస్యాల చట్టం కింద ఈ కేసు విచారణ చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్, షా మహ్మద్ ఖురేషీ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ఇది హై సెక్యూరిటీ కారాగారం.

కాగా, ఇమ్రాన్ ఖాన్ ఈ కేసు విచారణను ఓ జోక్ అని గతంలో కొట్టిపారేశారు. ప్రాసిక్యూషన్ బృందం, డిఫెన్స్ బృందం అందరూ ప్రభుత్వానికి చెందినవారే అయినప్పుడు తమకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

లండన్ లోని కొందరు వ్యక్తులు పక్కా ప్రణాళికతో ఈ తంతు నడిపించారని, ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో తనకు ముందే తెలుసని ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వంటిదేనని విమర్శించారు. కాగా, నేడు స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్టు తెలుస్తోంది.