జగన్ పాలన బ్రిటీష్ 2.0లా ఉంది: అచ్చెన్నాయుడు

ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారు

అమరావతి : జగన్ పాలన బ్రిటీష్ 2.0లా తయారైందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇవాళ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న వారిని అరెస్ట్ చేస్తూ.. ఓ నియంతలా జగన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే.. ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదేం ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు.

పోలవరం నిర్వాసితుల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న నేతలను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఈ మూడేళ్లలో పోలవరం పనులను ఎంత వరకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్వాసితులకు ఏ మేరకు సాయం చేశారని సీఎం జగన్ ను నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చిన హామీలిచ్చి ఇప్పుడు మోసం చేస్తారా? అని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతమవడంతో వైస్సార్సీపీ నేతల కడుపు మండిపోతోందని మండిపడ్డారు. రైతుల సభకు కోర్టు అనుమతినిచ్చినా ప్రజలు వెళ్లకుండా వైస్సార్సీపీ నాయకులు అడ్డుకుంటున్నారన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/