పుంగనూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలిః బొత్స

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రెచ్చగొడితే బాబు బుద్ధి ఎటుపోయిందని ప్రశ్న

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతిః టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కనుసన్నుల్లోనే పుంగనూరు ఘటన జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు రెచ్చగొడితే నీ బుద్ధి ఎటు పోయిందని చంద్రబాబును ప్రశ్నించారు. ఎస్పీజీ సెక్యూరిటీ కలిగిన నేత ఎటు వెళ్తున్నారనే విషయం ముందుగా చెప్పాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. పుంగనూరు ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికి చంద్రబాబే బాధ్యత వహించారని, అంతేకాదు టిడిపి అధినేతపై చర్యలు తీసుకోవాలన్నారు.

మరోవైపు, పుంగనూరు ఘటనలో గాయపడిన పోలీసులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబు రాజకీయంగా దివాళా తీశారని, అంతులేని ఆవేదన, ఆలోచనతో బాధపడుతున్నారని ధ్వజమెత్తారు. పుంగనూరు బైపాస్ నుండి వెళ్తామని పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చి, కావాలనే పుంగనూరులోకి వెళ్లే ప్రయత్నం చేశారన్నారు. పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేశారని, చంద్రబాబు రెచ్చగొట్టడం వల్ల టిడిపి కార్యకర్తలు దాడి చేశారన్నారు. పోలీసులపై ఇలా దాడి జరిగిన ఘటనలు ఇటీవలి కాలంలో లేవన్నారు.