జగన్ ను ఇంటికి పంపించడమే లక్ష్యంగా వచ్చే ఎన్నికలుః గోరంట్ల
అధికారంలోకి వచ్చిన వెంటనే సజ్జలను జైల్లో పెడతాం.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి
అమరావతిః ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక గాడిద అంటూ టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సజ్జలను జైలుకు పంపిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన వైఫల్యాలను మంత్రులు, ఎమ్మెల్యేలపై నెట్టేస్తున్నారని విమర్శించారు. చివరకు మంత్రులకు కూడా స్థాన చలనం చేస్తున్నారని అన్నారు. రామచంద్రాపురంలో పని చేయని మంత్రి రాజమండ్రి రూరల్ లో పని చేస్తాడా? అని ప్రశ్నించారు. అవినీతిపరుడైన ఒక వ్యక్తి మరోచోట మంచోడైపోతాడా? అని అన్నారు.
ఏసుక్రీస్తు గెటప్ లో జగన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. దుర్మార్గుడైన జగన్ కు ఏసుక్రీస్తుతో పోలికా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒక అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి అని, చేతకాని దద్దమ్మ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం అయిందని చెప్పారు. రాష్ట్రమంతా తిరిగి లోకేశ్ ప్రజల సమస్యలను తెలుసుకున్నారని అన్నారు. జగన్ ను ఇంటికి పంపించడమే లక్ష్యంగా వచ్చే ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు.