అరుణాచల్ ప్రదేశ్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్
సహాయక చర్యల కోసం బయల్దేరిన బృందం
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు ఆర్మీ హెలికాప్టర్ కూలింది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని టూటింగ్ హెడ్క్వార్టర్స్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఆ హెలికాప్టర్ కూలినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన మిగ్గింగ్ గ్రామం అటవీ ప్రాంతమని అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం లేకపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యమవుతోందని వివరించారు. ఇప్పటికే ఓ సహాయక బృందాన్ని ప్రమాద స్థలానికి పంపించినట్లు పేర్కొన్నారు.
అయితే, ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ఎంతమంది ఉన్నారనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉందని పేర్కొన్నారు. ఇటీవలే కేదార్ నాథ్ లో హెలికాప్టర్ కూలిన విషయం తెలిసిందే. గాల్లోకి లేచిన కొన్ని క్షణాలలోనే హెలికాప్టర్ కూలిపోవడంతో పైలట్ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, అక్టోబర్ నెల ప్రారంభంలో ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కూలిపోవడంతో పైలట్ మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి.