నేడు కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరబోతున్న దాసోజు శ్రవణ్

రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపి లో చేరిన దాసోజు శ్రవణ్..ఇప్పుడు బిజెపికి రాజీనామా చేసి , టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కి తన రాజీనామా లెటర్ ను అందజేయడం జరిగింది. నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రవణ్ గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక హోరు కొనసాగుతుంది. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రెండు నెలల క్రితం బీజేపీలో చేరారు. కాగా ఎంతో కాలం ఆయన బిజెపి లో కొనసాగలేకపోయారు. బిజెపి లో దశ దిశాలేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని , మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుస్సాకరంగా ఉందని మండిపడ్డారు. నోట్లు పంచి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బిజెపి తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానట్లు తెలిపారు. అనేక ఆశలతో, ఆశయాలతో నేను బీజేపీలోకి చేరినప్పటికీ దశ-దిశా లేని న్యాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మ రాజకీయాలకు, కానీ తెలంగాణ ఏ మాత్రం ఉపయోగకరంగా లేదని అనతికాలంలో అర్ధమైంది. ప్రజాహితమైన పథకాలతో నిబద్దత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడం కంటే మందు, మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం తద్వారా మునుగోడు ఉపఎన్నికలో గెలుపు సాధించాలనుకుంటున్న మీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని దాసోజు శ్రవణ్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

నేడు సాయంత్రం కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. అలాగే శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ను మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక శ్రావణ్ విషయానికి వస్తే..ప్రజా రాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్.. కొద్ది రోజుల్లోనే మంచి సబ్జెక్ట్ ఉన్న రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో పవన్ కు సన్నిహితంగా ఉన్న శ్రావణ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి 91 వేల ఓట్లు తెచ్చుకున్నారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఆ తరువాత దాసోజు శ్రవణ్ కొద్ది కాలంలోనే కేసీఆర్, కేటీఆర్ కు సన్నిహితుడిగా మారారు. తర్వాత టీఆర్ఎస్ భువనగిరి ఎంపీ టికెట్ ను ఆశించిన శ్రవణ్.. టికెట్ దక్కకపోవడంతో మనస్థాపానికి గురై పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.