టీడీపీ మహానాడుకు ఏపీ సర్కార్ అడ్డంకులు..?
ఈనెల 27, 28వ తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు వేడుక జరగబోతున్న సంగతి తెలిసిందే. 40 ఏళ్ల ప్రస్థానం చాటేలా, భవిష్యత్ ప్రయాణాన్ని నిర్ధేశించేలా ప్రణాళిక సిద్ధం చేసారు. అయితే ఈ మహానాడు కు వైపీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. మహానాడు నిర్వహణకు ఒంగోలు మినీ స్టేడియం గ్రౌండ్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. అలాగే మహానాడుకు కార్యకర్తలు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వలేమని ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు. అక్కడితో ఆగకుండా స్కూల్ బస్సులు, ప్రైవేటు బస్సులు కూడా పంపొద్దని ట్రావెల్స్ యజమానులకు ఆర్టీఏ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.
ఒంగోలు చర్చి సెంటర్లో కట్టిన టీడీపీ తోరణాలు కార్పోరేషన్ అధికారులు తొలగించారు. ఇలా ప్రతి దానిట్లో ప్రభుత్వం అడ్డు పుల్ల వీస్తుండడం తో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు, సమావేశాలు పెట్టుకునే హక్కుంటుందని, జగన్మోహన్రెడ్డి యాత్ర చేసే సమయంలో తాము కూడా అలా అనుకుంటే యాత్ర జరిగేదా? అని ప్రశ్నించారు. అనవసరంగా తెలుగుదేశం పార్టీవారిని రెచ్చగొడితే తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వానికి తెలియజేయండని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉద్బోధించారు. అతి చేసిన అధికారులను గుర్తుంచుకుంటామని, భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతద్వారా మహానాడుకు ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, వారిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎక్కడికక్కడప్రయత్నాలు చేస్తోందన్నారు.