కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురి మృతి

కాకినాడ జిల్లా చిన్నంపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లారీ టైర్ పంక్చర్ అవగా.. మరమ్మతులు చేస్తున్న సమయంలో నలుగురిపైకి సూపర్ లగ్జరీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు.

ప్రత్తిపాడు మండలంలోని పాదాలమ్మ గుడి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది.ఒక లారీ టైరుకు పంక్చర్ కావడంతో దానిని రోడ్డు పక్కన ఆపారు. టైర్ మార్చడంలో వీరికి సహాయంగా మరో లారీ డ్రైవర్, క్లీనర్ కూడా వచ్చారు. వీరంతా టైర్ మార్చడంలో ఉండగా.. సూపర్ లగ్జరీ బస్సు వీరి పైనుంచి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

స్థానికులు సమాచారం అందించడంతో రాజమండ్రి సమీపంలోని మొమ్మూరు వద్ద పోలీసులు బస్సును గుర్తించి ఆపారు. నిందిత డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతులను దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, నాగయ్య, రాజులుగా గుర్తించారు. ముగ్గురు వ్యక్తులు బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెంకు చెందినవారని, ఒకరు ప్రత్తిపాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.