నేడు శ్రీకాకుళంలో ‘రా.. కదలిరా’ సభ

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు శ్రీకాకుళంలో ‘రా.. కదలిరా’ సభలో పాల్గొననున్నారు. 80 అడుగుల రోడ్డు వద్ద మ.3 నుంచి 4.30 గంటల వరకు ఈ సభ జరగనుంది. శ్రీకాకుళంలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు.

టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. టిడిపి-జనసేన కూటమిని గెలిపించాలని… వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే వాటిల్లే ఉపద్రవాన్ని ప్రజలకు స్వయంగా వివరించనున్నారు. వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది. ఈ నేపథ్యంలో ‘యుద్ధభేరి’ పేరిట చంద్రబాబు గతేడాది ఆగస్టు 10న జిల్లాలో పాతపట్నం నియోజకవర్గంలో పర్యటించారు. ఆ తర్వాత జిల్లాలో మూడుసార్లు చంద్రబాబు పర్యటన ఖరారైనా.. అనివార్య కారణాలతో రద్దయ్యాయి. తాజాగా.. ‘రా.. కదలిరా’ పేరిట కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకానున్నారు.

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించిన తర్వాత.. తొలిసభ సిక్కోలు నుంచే ప్రారంభం కావడంతో అధినేత పర్యటనను విజయవంతం చేసేందుకు తెలుగుతమ్ముళ్లు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా టీడీపీ శ్రేణులు, అభిమానులు, సాధారణ జనం తరలివచ్చేలా రూపకల్పన చేశారు.