ఏపీలో పెరిగిన విజయ పాల ధర..

ఏపీ రాష్ట్ర ప్రజలకు షాకింగ్ న్యూస్..విజయ పాల ధర పెరిగింది. అరలీటరు ప్యాకెట్ సహా ఆరు రకాల ప్యాకెట్ల ధరలను రూపాయి చొప్పున పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. రైతుల పాల సేకరణ ధరలు, నిర్వహణ, రవాణా ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో తెలిపారు. మార్చి 1 నుంచి విజయ పాల ధర అర లీటరు ప్యాకెట్‌పై రూ. 1 చొప్పున పెరగనుంది.

ఆరు రకాల ప్యాకెట్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. పెరుగు, చిన్న పాల ప్యాకెట్లు, ఇతర పాల పదార్థాల విక్రయ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. నెలవారీ పాల కార్డుదారులకు మార్చి 9 వరకు పాత ధరలే వర్తిస్తాయని తెలిపారు. పెరిగిన ధరతో అర లీటరు లో ఫ్యాట్ (డీటీఎం) ధర రూ.27, ఎకానమీ (టీఎం) రూ. 29, ప్రీమియం (స్టాండర్డ్) రూ. 31, స్పెషల్ (ఫుల్‌క్రీమ్) రూ. 36, గోల్డ్ రూ. 37, టీ మేట్ ధర రూ. 34కు పెరిగినట్టు కృష్ణా మిల్క్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు తెలిపారు.