జేపీ నడ్డాతో మిథాలీ రాజ్ సమావేశం

women-cricket-legend-mithali-raj-me-bjp-national-president-jp-nadda

హైదరాబాద్‌ః బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నేడు మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ హైదరాబాద్ లో కలిశారు. మిథాలీ నడ్డాకు పుష్పగుచ్ఛం అందించి అభివాదం తెలిపారు. నడ్డా కూడా మిథాలీకి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ భేటీ రాజకీయ సంబంధమైనదా? లేక, మర్యాదపూర్వకంగా జరిగినదా? అనేదానిపై స్పష్టత లేదు. మిథాలీ ఇటీవలే క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అటు, టాలీవుడ్ హీరో నితిన్ కూడా నేడు జేపీ నడ్డాను కలవనున్నారు. నోవాటెల్ హోటల్ లో వీరి భేటీ ఉంటుందని తెలుస్తోంది.

కాగా, ఇటీవల తరచుగా హైదరాబాద్ వస్తున్న బిజెపి అగ్రనేతలు ఇక్కడి ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా టాలీవుడ్ అగ్ర కథనాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/