మహారాజా ఆసుపత్రి పేరు మార్పు..జగన్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంది: లోకేశ్

ఆసుపత్రికి మహారాజా పేరును కొనసాగించాలని డిమాండ్

ap-govt-changed-name-of-vizianagaram-maharaja-hospital

అమరావతిః ఏపిలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల పేర్ల మార్పు కొనసాగుతుంది. ఇప్పటికే ఏపి సర్కార్‌ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చిన విషయం తెలిసిందే. తాజాగా విజయనగరంలో ఉన్న మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరును కూడా మార్చెసింది. మహారాజా జిల్లా కేంద్ర ఆస్పత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మార్చింది. అయితే ఈ విషయం పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శులు గుప్పించారు. సిఎం జగన్‌ పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరుకుందని ఆయన అన్నారు. మహనీయులను అవమానిస్తూ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి పెద్ద తప్పు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు విజయనగరంలో ఉన్న మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరును మార్చి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నగరం నడి బొడ్డున విలువైన భూమిని ఆసుపత్రికి ఇచ్చింది మహారాజా కుటుంబమని… కేంద్ర మంత్రిగా నిధులను కేటాయించి అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేసింది అశోక్ గజపతిరాజు అని చెప్పారు. రాత్రికి రాత్రి మహారాజా పేరును తొలగించారని… దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని… ఆసుపత్రికి మహారాజా పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/