తెలుగు ప్రజలకు శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జగన్

తెలుగు ప్రజలకు శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, సమృద్ధిగా వానలు కురవాలని; పంటలు బాగా పండాలని, రైతులకు మేలు జరగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శుభకృత్ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలషించారు. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం నేతలు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ , తదితరులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో చేసుకోవాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. అచ్చ తెలుగు పండగైన ఉగాదిని.. ఇంటిల్లిపాదీ కలిసి నిర్వహించుకోవాలన్నారు. శుభకృత్ నామ సంవత్సరం.. ప్రజలకు సర్వ శుభాలను కలగజేయాలని కోరుకున్నారు.