మండలి రద్దు తర్వాతే రాజీనామా చేస్తాం
స్పష్టతనిచ్చిన మంత్రి మోపిదేవి వెంకటరమణ
అమరావతి: ఏపి కేబినెట్ శాసనమండలిని రద్దుకు ఆమోదం తెలిసిన విషయం తెలిసందే. దీంతో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో మంత్రి పదవులకు రాజీనామా చేస్తారా? అన్న ప్రశ్నకు మోపిదేవి స్పందించారు. ఈ రోజు మోపిదేవి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజీనామా చేస్తాం.. అయితే, రాజీనామాలకు కొన్ని పద్ధతులు ఉంటాయి. మండలి రద్దు తర్వాత కేంద్రం నుంచి సమాచారం వచ్చాక రాజీనామా చేస్తాం’ అని స్పష్టతనిచ్చారు. కాగా, వ్యవసాయ రంగానికి సీఎం అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అలాగే, ఆక్వారంగానికి కూడా ప్రాధాన్యత నిచ్చి ప్రకాశం, గుంటూరు జిల్లాల ఓడరేవులతో పాటు ఉప్పాడలో ఫిషింగ్ జెట్టిలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.
కాగా, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజీనామా చేసినప్పటికీ వారికి అండగా ఉంటామని సిఎం జగన్ ఇటీవల హామీ ఇచ్చారు. మంత్రి పదవులు లేకపోయినా పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని వైఎస్ఆర్సిపి నేతలు చెప్పారు. ఇప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి ఇద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/