ఎమ్మెల్యే షకీల్ వాహనం ఢీకొని 11 ఏళ్ల బాలుడు మృతి

బోధన్ కి చెందిన దీపక్ తేజ (11) ను బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్ కి తీవ్ర గాయాలు అయ్యాయని గుర్తించిన వైద్యులు.. వెంటిలేటర్ పై బాలునికి చికిత్స అందించడం ప్రారంభించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ల వెల్లడించి..వెంటనే హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో తేజ చనిపోయాడు.

ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే వాహనంలో ఆయన భార్య ప్రయాణిస్తున్నట్లు కొంతమంది స్థానికులు తెలిపారు. తమ కొడుకు మృతికి కారణమైన ఎమ్మెల్యే అనుచరులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు.. ప్రమాదానికి గురైన దీపక్ తేజను నిజామాబాద్ కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.