హైదరాబాద్‌ చేరుకున్న కేంద్రమంత్రి అమిత్ షా

ఘన స్వాగతం పలికిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల

amit-shah-reaches-shamshabad-airport

హైదరాబాద్‌ః కేంద్ర హోంశాఖ మంత్రి, బిజెపి అగ్రనేత అమిత్ షా గురువారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో బిజెపి ముఖ్య నాయకులతో అమిత్ షా సమావేశం కానున్నారు.

ఆ తర్వాత పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ విజయాన్ని కాంక్షిస్తూ… తెలంగాణ ప్రజల యోగక్షేమాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి… అమ్మవారి ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం బిజెపి మండలాధ్యక్షులతో సమావేశం కానున్నారు.