ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబ సభ్యులకు అమిత్ షా ఫోన్

ఖమ్మం జిల్లాలో పోలీసుల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆత్మహత్యకు యత్నించిన సాయి గణేష్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన పట్ల కేంద్రమంత్రి అమిత్ షా, సాయిగణేష్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. కేసుపై ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని బీజేపీ నాయకులు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో సాయిగణేష్ కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు అమిత్ షా. సాయి గణేష్ కుటుంబానికి అన్ని విదాల సహాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఖమ్మం నగరంలోని స్థానిక 37వ డివిజన్ లో నివాసముంటున్న సాయి గణేష్ అనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్త తన డివిజన్ లో పార్టీ దిమ్మను నిర్మించాడు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ నేతలు దిమ్మను కూల్చడంతో వివాదం చోటు చేసుకుంది. దీనిపై సాయి గణేష్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయి గణేష్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. అంతేకాకుండా సాయి గణేషన్ ఇష్టారీతిగా తిట్టడంతో మనస్థాపానికి గురై అక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం గమనించిన పోలీసులు, పార్టీ నాయకులు సాయి గణేష్ ను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అతడి పరిస్థితి విషమించడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశాల మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్ లో మెరుగైన వైద్యం కోసం చేర్పించారు. ఈ క్రమంలో సాయి గణేష్ చికిత్స పొందుతూ మరణించాడు. టీఆర్ఎస్ నేతల ఒత్తిడితోనే తన కొడుకుపై 16 అక్రమ కేసులు పెట్టారని గణేశ్ తల్లి ఆరోపించింది. తన కొడుకు మరణానికి కారణమైన వారిని చర్యలు తీసుకోవాలని తల్లి డిమాండ్ చేసింది.