భారత్, కెనడా ఉద్రిక్తత.. కీలక సమాచారం అందించిన అగ్రరాజ్యం.. కెనడాలోని అమెరికా రాయబారి క్లారిటీ!

america-interferes-in-india-canada-row

వాషింగ్టన్‌ః ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయంలో కెనడా- భారత్​ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్రిక్తతలకు గల కారణం కెనడాకు భారత్ గురించి అమెరికా ఓ కీలక సమాచారం చేరవేయడమేనని కెనడాలోని అమెరికా రాయబారి డేవిడ్‌ కోహెన్‌ చెప్పారు. ఈ మేరకు న్యూయార్క్​ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయంలో అమెరికా అందించిన సమాచారంతోనే భారత్​పై కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేశారని న్యూయార్క్​ టైమ్స్ కథనం పేర్కొంది. ‘ఫైవ్‌ ఐయ్స్‌'(ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌, అమెరికా, యూకేలు భాగస్వాములుగా 1946లో ఫైవ్‌ ఐయ్స్‌ను స్థాపించారు.) దేశాల మధ్య జరిగిన నిఘా సమాచార మార్పిడి.. ట్రూడోను భారత్‌పై ఆరోపణలు చేయడానికి ప్రేరేపించిందని తెలిపింది. ఏ రకమైన సమాచారాన్ని కెనడాతో పంచుకున్నారో మాత్రం ఈ ఇంటర్వ్యూలో కోహెన్‌ చెప్పలేదు. అయితే కెనడా చేస్తున్న ఆరోపణలు నిజమైతే.. అంతర్జాతీయ నిబంధనలను భారత్‌ తీవ్రంగా ఉల్లంఘించినట్లే అవుతుందని కోహెన్ అభిప్రాయపడ్డారు.