గుంటూరు లోక్‌సభ బరిలో అంబటి రాయుడు..?

భార‌త క్రికెట‌ర్, గుంటూరు జిల్లాకు చెందిన అంబ‌టి రాయుడు..గురువారం వైస్సార్సీపీ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న రాయుడిని సీఎం జ‌గ‌న్ సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా క్రికెట‌ర్ రాయుడు మాట్లాడుతూ.. వైస్సార్సీపీ లో చేర‌డం సంతోషంగా ఉందని , జీవితంలో త‌న సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంద‌ని తెలిపారు. తొలి నుంచి త‌న‌కు సీఎం జ‌గ‌న్ పై న‌మ్మకం ఉంద‌ని, కుల మ‌తాల‌కు అతీతంగా సీఎం జ‌గ‌న్ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి వైస్సార్సీపీ అభ్యర్థిగా అంబటి రాయుడు పోటీ చేయనున్నారని తెలుస్తుంది. పార్టీ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ ఇదే ఫిక్స్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఆరు నెలలుగా గుంటూరు లోక్‌సభ పరిధిలో అంబటి రాయుడు విస్తృతంగా పర్యటిస్తుండడం ఈ ఊహాగానాలకు ప్రధాన కారణంగా ఉంది. ఇప్పటికే చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. వైస్సార్సీపీ నేతలను పరిచయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. దీంతో గుంటూరు లోక్‌సభ సీటు ఖాయమని తెలుస్తోంది.