టీడీపీ లో కన్నా చేరడం ఫై మంత్రి అంబటి సెటైర్లు

బిజెపి మాజీ నేత, కన్నా లక్ష్మీనారాయణ గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు. ఈ సందర్భాంగా కన్నా కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. కన్నాతో పాటు ఆయన కుమారుడు, గుంటూరు మాజీ మేయర్ నాగరాజు తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కన్నా అనుచరులు దాదాపు 3 వేల మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కన్నా చేరడం తో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే..వైస్సార్సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు చేతిలో కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తు శూన్యం అని, కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరితే ఎవరికి ఎలాంటి నష్టం లేదని అన్నారు. కన్నా తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి అని ఆరోపించారు అంబటి. కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవులు అనుభవించి చివరికి దానికి రాజీనామా చేసి చివరి క్షణంలో బిజెపిలో చేరాడని కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు కన్నా లక్ష్మీనారాయణని బిజెపి అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారు అందరికీ తెలుసు అన్నారు. ఇక కన్నా లక్ష్మీనారాయణకు జనసేనలో బేరం కుదరక టిడిపిలో చేరారని ఆరోపించారు. కన్నా గురించి ఎవరూ ఆలోచించడం లేదని.. కానీ ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.