టిడిపి, జనసేన పోత్తులపై స్పందించిన అంబటి రాంబాబు

ప్యాకేజ్ బంధం బయటపడిందన్న వైఎస్‌ఆర్‌సిపి

ambati-rambabu-comments-on-tdp-janasena-alliance

అమరావతిః ఏపిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపి, జనసేన కలిసి ఎదుర్కొంటాయని జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌సిపి నేత, మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో గురువారం ట్వీట్ చేశారు. పొత్తులపై ఇప్పుడు నిర్ణయం తీసుకున్నానన్న పవన్ వ్యాఖ్యలతో ఆయన విభేదించారు. ‘కల్యాణ్ బాబూ… ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే నమ్మే పిచ్చోళ్లు ఎవరూలేరు’ అంటూ చురకలు అంటించారు.

అంతకుముందు కూడా చంద్రబాబుతో పవన్ ములాఖత్‌పై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. జనసైనికులూ… ఆలోచించండి, ఊళ్లో పెళ్లికి కుక్కల హడవుడిలా లేదూ? అని ప్రశ్నించారు. అలాగే, ములాఖత్ గురించి ట్వీట్ చేస్తూ.. ఎప్పుడో చంద్రబాబుతో ములాఖత్ అయ్యాడు.. ఇప్పుడేముంది కొత్తగా అని పేర్కొన్నారు.

టిడిపి, జనసేన మధ్య పొత్తు ఉంటుందన్న పవన్ వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌సిపి స్పందించింది. ఈ మేరకు ప్యాకేజీ బంధం బయటపడిందంటూ ట్వీట్ చేసింది. ‘పవన్ కల్యాణ్… నువ్వు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌కి వెళ్ళింది టీడీపీతో పొత్తును ఖాయం చేసుకునేందుక‌ని ప్ర‌జ‌ల‌కు పూర్తిగా అర్థం అయింది. ఇన్నాళ్ళూ నీమీద న‌మ్మ‌కం పెట్టుకున్న‌ అభిమానుల‌కు, కాస్తో కూస్తో నిన్ను న‌మ్మిన వాళ్ళ‌కు ఈరోజుతో భ్ర‌మ‌లు తొల‌గించేశావు. ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం.’ అని ట్వీట్ చేసింది.