భారీ వర్షాలు.. మరోసారి అమర్​ నాథ్​ యాత్ర నిలిపివేత

అంతా ఎక్కడికక్కడే క్యాంపుల్లో నిలిపివేత

amarnath yatra
amarnath yatra

శ్రీనగర్‌ః ఎడతెరిపిలేని వర్షాల కారణంగా మరోసారి అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వర్షాలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయని.. వర్షాలు తగ్గే వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ) అధికారులు ప్రకటించారు. గురువారం అమర్ నాథ్ యాత్రకు పహల్గాం, బల్తాల్ మార్గాల ద్వారా వెళ్లే యాత్రికులను నిలిపివేశామని.. వర్షాలు తగ్గాక అప్పటి పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

కాగా, గత నెల 30న అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఆ రోజునే పహల్గాం, బల్తాల్ రెండు మార్గాల్లో తొలి యాత్రికుల బృందాలు అమర్ నాథ్ కు పయనమయ్యాయి. అయితే కొద్దిరోజుల్లోనే జులై 5న తొలిసారి అధిక వర్షాల కారణంగా యాత్ర నిలిచిపోయింది. తర్వాత అకస్మాత్తుగా వరదలతో 8వ తేదీన మరోసారి యాత్రను తాత్కాలికంగా ఆపేశారు.

తిరిగి ప్రారంభమైనా.. ఇప్పుడు మూడోసారి ఆగిపోయింది. ఇప్పటివరకు మొత్తం 1.44 లక్షల మంది యాత్రికులు అమర్ నాథ్ లింగాన్ని దర్శించుకున్నట్టు అమర్ నాథ్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం 16,457 మంది యాత్రికులు అమర్ నాథ్ యాత్రా మార్గంలో ఉన్నారని.. మరో 5,449 మంది జమ్మూలోని బేస్ క్యాంపు నుంచి బుధవారమే బయలుదేరారని తెలిపింది. వీరంతా ఎక్కడికక్కడే ఆగిపోయినట్టు వెల్లడించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/