అమర్​నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. ఆరుగురు మృతి

అమర్​నాథ్ నుండి తిరిగి వస్తుండగా శనివారం ఉదయం మూడు గంటల సమయంలో ముంబయి-నాగ్​పుర్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయపడ్డారు. అమర్​నాథ్ యాత్రను పూర్తి చేసుకొని కొంతమంది ప్రవైట్ ట్రావెల్ బస్సులో తిరిగి వస్తుండగా..రాష్ట్రంలోని బుల్దానా జిల్లా మల్కాపూర్ దగ్గర్లోని నందూర్ నాకా ప్లైఓవర్ వద్దకు రాగానే ..ఎదురుగా వస్తున్న మరో ప్రవైట్ ట్రావెల్ బస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది గాయపడగా..ఆరుగురు మృతి చెందారు. తెల్లారితే క్షేమంగా ఇంటికి చేరుకుంటారనగా ఈ ఘోరం జరిగింది.

ప్రమాద విషయాన్నీ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మందిని బుల్దానా జిల్లా ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ 32 మంది ప్రయాణికులకు ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపించినట్లు అధికారులు తెలిపారు. బుల్దానా జిల్లాలో ఈ నెలలో జరిగిన రెండో ఘోర ప్రమాదమిది. ఈ నెల 1న సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే పైన బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే.