వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

నిత్యం రోడ్డు ప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇంటి నుండి బయటకు వెళ్లిన వారు తిరిగి వచ్చే వరకు నమ్మకం లేని రోజులు వచ్చాయి. రాష్ డ్రైవింగ్ , మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం , నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమాయకపు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పోలీసులు ఎన్ని నిబంధనలు చేపట్టిన రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది.

తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోలో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్‌ను రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మద్యం మత్తులో లారీని రాంగ్‌రూట్‌లో నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.