దుగ్గిరాల మండలంలో పర్యటించిన నారా లోకేష్..
కేంద్రం ఇచ్చే నిధులను జగన్ ప్రభుత్వం కాజేస్తోందని టీడీపీ నారా లోకేశ్ అన్నారు. దుగ్గిరాల మండలం ఈమనిలో లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ..ఏపీలో పరిస్థితులు చూస్తుంటే బీహార్ను చూస్తున్నట్లు ఉందని అన్నారు. మంగళగిరిలో చరిత్ర తిరగరాస్తామని, టీడీపీ జెండాను ఎగురవేస్తామని ఆయన తెలిపారు. మంగళగిరి పౌరుషం ఏమిటో వైసీపీకి చూపిస్తామని లోకేష్ అన్నారు.
ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. 3 నెలల్లో ఈమని గ్రామ రూపురేఖలు మారుస్తానన్న ఎమ్మెల్యే ఎక్కడ? అని ప్రశ్నించారు. కేసులు పెట్టి వేధిస్తున్నందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అవినీతిరహిత పాలన అని జగన్ అంటుంటే పిల్లలు కూడా నవ్వుతున్నారని తెలిపారు. ఏసీబీ యాప్ పెట్టగానే జగన్పై తానే మొదటి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇసుక, కల్తీ మద్యంతో జగన్ వేల కోట్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు సొంత కార్యకర్తల భూములనూ కొట్టేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.