ఫోన్ కు రీఛార్జ్ చేయించలేదని 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

ప్రస్తుతం ఫోన్ వాడకం బాగా పెరిగింది. చిన్న పిల్లాడి దగ్గరి నుండి పండు ముసలోడి వరకు ప్రతి ఒక్కరు ఫోన్ ను వాడుతున్నారు. ఉదయం లేచినదగ్గరి నుండి పడుకునే వరకు ఫోన్ తోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో 12 ఏళ్ల బాలుడు తన ఫోన్ కు రీఛార్జ్ చేయించలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామంలో చోటుచేసుకుంది.

భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామంలో యశోద అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. రెండేళ్ల క్రితమే తన భర్త చనిపోయాడు. దీంతో అప్పటి నుంచి ఆ మహిళ తన ఇద్దరు పిల్లలను చూసుకుంటుంది. అయితే పెద్ద కుమారుడు తరుణ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కాగా గత కొన్నిరోజుల నుంచి వీరి ఇంట్లో టీవీ రావడం లేదు. దీంతో పాటు మొబైల్ ఫోన్ రీఛార్జ్ కూడా అయిపోయింది. ఈ క్రమంలోనే పెద్ద కుమారుడు తరుణ్ టీవీ, ఫోన్ రీచార్జ్ చేయించాలని ఇటీవల తల్లిని కోరాడు. టీవీ వైర్లను ఎలుకలు కోరికాయని, రిపేర్ చేయించి టీవీ, మొబైల్ ఫోన్ రెండూ ఒకేసారి రీఛార్జ్ చేయిస్తానని తల్లి కుమారుడికి వివరించింది.

కానీ ఆ బాలుడు మాత్రం తల్లి మాటను వినిపించుకోలే..రీఛార్జ్ చేయిస్తావా లేదా అంటూ గొడవ పెట్టుకున్నాడు. దీంతో కోపంతో తల్లి యశోద పెద్ద కుమారుడిని మందలించి పొలానికి వెళ్లిపోయింది. దీంతో ఆ బాలుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక అదే రోజు మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో తరుణ్.. ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆ బాలుడిని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఆ బాలుడు అప్పటికే మరణించాడని తెలిపారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లి యశోద గుండెలు పగిలేలా ఏడ్చింది.