దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు
న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో 10 వేల లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 1,08,436 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,111 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,48,27,226 కి చేరింది. ఇక యాక్టివ్ కేసులు 60 వేల మార్క్ను దాటాయి. ప్రస్తుతం 60,313 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,42,35,772 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో గుజరాత్లో ఆరుగురు, ఉత్తర్ ప్రదేశ్, కేరళలో నలుగురు చొప్పున, ఢిల్లీ, రాజస్థాన్లో ముగ్గురు చొప్పున, మహారాష్ట్రలో ఇద్దరు, బీహార్, చత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ మృతుల సంఖ్య 5,31,141కి ఎగబాకింది.
ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.13శాతం కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,26,522) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.