ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్‌ నమోదు

Central Election Commission

హైదరాబాద్‌ః తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌ల వద్ద బార్లు తీరారు. కాగా ఉదయం 9 గంటల సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 9.21 శాతంగా నమోదయిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 9 గంటల వరకు లోక్‌సభకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్‌ నమోదయినట్టు పేర్కొంది. కుప్పం నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 9.72శాతం, మంగళగిరిలో 5.25శాతం, పిఠాపురంలో 10.02శాతం, పులివెందుల 12.44శాతం పోలింగ్‌ నమోదయినట్టు అధికారులు వివరించారు.

ఏపీలో జిల్లాల వారీగా చూస్తే 9 గంటల సమయానికి వైఎస్‌ఆర్‌ జిల్లాలో 12.09శాతం గరిష్ఠంగా నమోదయింది. ఇక అత్యల్పంగా గుంటూరులో 6.17శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. తెలంగాణ జిల్లాలను పరిశీలిస్తే ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 13.22శాతం పోలింగ్ శాతం నమోదయ్యింది. ఇక హైదరాబాద్‌లో అత్యల్పంగా 5.06 శాతం మాత్రమే నమోదయింది.

కాగా, తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జోరుగా కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది.