ఆలయ షెడ్డుపై కూలిన వేపచెట్టు.. ఏడుగురు మృతి
బాధితులకు ఆర్థిక సాయం అందించాలని సీఎం నిర్ణయం
ముంబయిః మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. జిల్లాలో కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులతో పరాస్ గ్రామంలో ఉన్న బాబుజీ మహరాజ్ మందిర్ సంస్థాన్కు చెందిన రేకుల షెడ్డుపై భారీ వేప చెట్టు పడింది. దీంతో షెడ్డుకింద తలదాచుకున్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు స్థానికులతో కలిసి సహాయకచర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో చెట్టును తొలగించారు. శిథిలాల కింది నుంచి క్షతగాత్రులను బయటకు తీసి దవాఖానకు తరలించారు. మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, చెట్టు కూలిన ఘటనను జిల్లా కలెక్టర్ నిమా అరోరా ధృవీకరించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 30 నుంచి 40 మంది గాయపడ్డారని, ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారని చెప్పారు.
కగా, అకోలాలోని పరాస్లో కొందరు భక్తులు మతపరమైన వేడుక కోసం అక్కడకు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. చెట్టు కూలి భక్తులు చనిపోవడం తనను బాధించిందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్లో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీ క్షతగాత్రులకు సకాలంలో చికిత్స అందేలా చూశారు. బాధితులకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నిర్ణయించారు.