ఆయన ఎవరనుకుంటే వారు మంత్రులుగా ఉంటారు: మంత్రి బాలినేని
మంత్రివర్గాన్ని మారుస్తారని ఆరు నెలల క్రితమే చెప్పా..మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
అమామరావతి: సీఎం జగన్ నిన్న త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారిలో కొందరు కొనసాగుతారని… మంత్రి పదవి నుంచి తప్పించిన వారికి పార్టీ జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కొత్త మంత్రివర్గ ఏర్పాటు అనేది ముఖ్యమంత్రి నిర్ణయమని అన్నారు. ఆయన ఎవరు కావాలనుకుంటే వారు మంత్రులుగా ఉంటారని చెప్పారు. ఎవరిని ఉంచాలో, ఎవరిని తీసేయాలో జగన్ కు బాగా తెలుసని అన్నారు.
మంత్రివర్గాన్ని మారుస్తారనే విషయాన్ని తాను ఆరు నెలల క్రితమే చెప్పానని బాలినేని తెలిపారు. ముందస్తు ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు పాలించడానికే తమకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు రావాలని చెప్పడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టీడీపీకి 20 సీట్లు వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లను కాపాడుకున్నా గొప్పేనని అన్నారు. అసెంబ్లీని బాయ్ కాట్ చేసి జగన్ సీఎం అయ్యారని, చంద్రబాబు కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేసి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/