కారుపై విరిగిపడిన కొండచరియలు..అయిదుగురు మృతి
రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్లో రుద్రప్రయాగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కారులో ఉన్న అయిదుగురు మృతిచెందారు. శిథిలాలను తొలగించే పనిలో అధికారులు ఉన్నారు. రోడ్డును క్లియర్ చేసేందుకు రెస్క్యూ టీమ్ పనిచేస్తోంది. చార్థామ్ యాత్రలో ఉన్న అయిదుగురు యాత్రికులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులు గుజరాత్కు చెందినట్లు అధికారులు చెప్పారు. వాళ్లంతా కేదార్నాథ్ వెళ్తున్నట్లు తెలిపారు.
కేదార్నాథ్ హైవేపై ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. తార్సలి వద్ద భారీ రాళ్లు కారుపై వచ్చి పడ్డాయి. ఆ కారు పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయింది. గుప్తకాశీ-గౌరీకుండ్ హైవేను కూడా మూసివేశారు. ఆ రూట్లో దాదాపు 60 మీటర్ల రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. చౌకీ జవాది, కోత్వాలి రుద్రప్రయాగ్, చకీ తిల్వాడా, తానా అగస్త్యముని, కాక్దాగా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. గత కొన్ని రోజుల నుంచి రుద్రప్రయాగ్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.