మహారాష్ట్ర పర్భానీ జిల్లాలో విషాదం : సెప్టిక్ ట్యాంక్ ని శుభ్రం చేస్తూ ఐదుగురు కార్మికులు మృతి

మహారాష్ట్ర పర్భానీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ ని శుభ్రం చేస్తుండ‌గా విష‌పూరిత వాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన సోన్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌచా తండాలో చోటు చేసుకుంది.

పోలీసుల తెలిపిన ప్రకారం..ఆరుగురు కూలీలు ఓ పొలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగారు. ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ఐదుగురు కార్మికులు అక్కడికి చేరుకునేలోపే మరణించినట్లు తెలిపారు. సోన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదవశాత్తు మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారి తెలిపారు. ఈ ఘటన తో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.